గుంటూరు జిల్లా : ఎన్నారైలు సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటానని, కానీ ఈ రోజు నేను వచ్చిన ఈ కార్యక్రమం ఒక స్పూర్తిని ఇచ్చిందని చెప్పారు. ఇంకా సమాజంలో మంచి మిగిలి ఉంది అనడానికి మీరంతా ఉదాహరణ అని ప్రశంసించారు. 40 ,50 ఏళ్ల క్రితమే మీరు విదేశాలకు వెళ్లారు. కొందరు జన్మభూమిని మర్చిపోతారు. కానీ చదువుకున్న కాలేజీని గుర్తు పెట్టుకుని 1981లోనే జింకానా ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద సాయం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు. మనమే కాదు…మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి అని అన్నారు. ఎందరో ముందుకు వచ్చి పాఠశాలలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు పెద్ద ఎత్తున ప్రజలే విరాళాలు ఇచ్చారని తెలిపారు.
మనదేశంలో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలు మరే దేశంలో లేవు అన్నారు. అమెరికాలో 18 ఏళ్లకే పిల్లలు బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు. పిల్లలు ఎంత పెద్దవారైనా జీవితాంతం తల్లిదండ్రులు మెంటర్ చేయడం మనదన్నారు. నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారని, అంతేకాదు దాన్ని మెయింటైన్ చేయడం కోసం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయడం గొప్ప విషయం అన్నారు. ఏపీలో మెడిసిన్ చేసిన ఎంతోమంది అమెరికా వెళ్లారు. నేను 1995లో సీఎం అయినప్పుడు చాలామంది చదువుకుని అమెరికా వెళ్లిపోతున్నారు. బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందని కొందరు అడిగారు. రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని నేను అన్నానని గుర్తు చేశారు.
