అమరావతి : ఏపీలో తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగలపూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందే అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం కనిపిస్తోందని చెప్పారు అనిత వంగలపూడి. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్. రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. సోముదేవుపల్లి వద్ద వరాహ నదికి రక్షణ గోడ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు కావడంపై గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపల్లెలోని తన నివాసం వద్ద 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఇ-సైకిళ్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ ర్యాలీ చేపట్టారు. కుప్పం స్థానికులతో కలిసి ఇ-సైకిల్ ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు సీఎం. 5555 ఇ-సైకిళ్లతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా ర్యాలీ నిర్వహించారు. తూంసీలోని ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ ర్యాలీగా చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజా వేదిక డయాస్ వరకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ రావడం విశేషం. పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా చేస్తామని ప్రకటించారు.
