Ravela Kishore Babu : చివరి దాకా కేసీఆర్ తోనే ఉంటా – రావెల
మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్స్
Ravela Kishore Babu : ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఊపిరి ఉన్నంత దాకా సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఆయనకు రాజకీయంగా అపారమైన అనుభవం ఉందన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ రావెల కిషోర్ బాబుకు(Ravela Kishore Babu) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు మాట్లాడారు. కేసీఆర్ విజన్ ఉన్న నేత అని పేర్కొన్నారు. రాష్ట్రం విడి పోయినా అందరం ఒకేలా ఉన్నామన్నారు. కొందరు కావాలని విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
ఏపీలో బీఆర్ఎస్ తన ప్రభావాన్ని కచ్చితంగా చూపుతుందన్నారు. ప్రస్తుతం తోట చంద్రశేఖర్ రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు రావెల కిశోర్ బాబు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు.
ఏపీలో ప్రస్తుత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైందని ఆరోపించారు. తెలుగుదేశం , వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. భారత దేశ చరిత్రలో ఇంత వరకు మూడు రాజధానుల కథే లేదన్నారు . కానీ ఏపీలో జగన్ కొత్త రాగం అందుకున్నారని, అది ఇప్పట్లో అయ్యేది కాదంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పవర్ లోకి రావడం ఖాయమని, తాము వచ్చాక ఏపీకి మంచి రాజధానిని, సచివాలయాన్ని నిర్మించుకుంటామని చెప్పారు రావెల కిశోర్ బాబు.
Also Read : బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్