Sambit Patra : అదంతా కేజ్రీవాల్ ఎన్నికల స్టంట్
సడెన్ గా హిందువులపై ప్రేమ
Sambit Patra : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగింది బీజేపీ. భారతీయ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మి, వినాయకుడి చిత్రాలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ పేర్కొనడాన్ని తప్పు పట్టింది. ఇదంతా గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆడుతున్న నాటకమని కొట్టి పారేశారు బీజేపీ స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్ర(Sambit Patra).
ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదన్నారు. సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి దాకా బీజేపీని, హిందూత్వ వాదాన్ని విమర్శిస్తూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్నట్టుండి హిందూవులు ప్రత్యేకంగా అభిమానించి, ఆరాధించే దేవుళ్లపై ఎలా అంతలా ప్రేమ పుట్టుకు వచ్చిందో జనం అర్థం చేసుకోవాలని అన్నారు.
కేజ్రీవాల్ చెప్పేది ఏదీ చేయడని ఎద్దేవా చేశారు. ఇదంతా ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టేందుకే ఇలా చేస్తున్నాడని మండిపడ్డారు సంబిత్ పాత్ర. ఢిల్లీ సీఎం గతంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శించారని, అంతలోపు ప్రజలు ఎలా మరిచి పోతారని ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గుజరాత్ ప్రజలు గంప గుత్తగా భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయమని జోష్యం చెప్పారు సంబిత్ పాత్ర(Sambit Patra). అంతే కాకుండా స్వస్తిక్ గుర్తును హేళన చేశారని, పరమ పవిత్రమైన పండుగ రోజు హిందువులను జైలుకు పంపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
ఇదిలా ఉండగా నోట్లపై గాంధీతో పాటు లక్ష్మి, వినాయకుడి ఫోటోలు ముద్రిస్తే దేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందన్నారు. త్వరలోనే పీఎంకు లేఖ రాస్తానని తెలిపారు సీఎం కేజ్రీవాల్.
Also Read : సిద్దూ కేసులో అఫ్సానా ఖాన్ విచారణ