Senior Citizens: వరుడికి 95 ఏళ్ళు, వధువుకి 90 ఏళ్ళు ! 70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి !
వరుడికి 95 ఏళ్ళు, వధువుకి 90 ఏళ్ళు ! 70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి !
ఇద్దరు వ్యక్తులు లేటు వయసులో చేసుకున్న పెళ్ళి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ 90 ఏళ్ళ మహిళతో 70 ఏళ్ళ పాటు సహాజీవనం (రాజస్థానీ సాంప్రదాయం ప్రకారం ‘నత ప్రథ’) చేసిన ఓ వ్యక్తి 95 ఏళ్ళ వయసులో ఆమెను మనువాడాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య ఆమెను సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నాడు. రాజస్థాన్ లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ కు చెందిన రమాభాయ్ అంగారి (95)… అదే గ్రామానికి చెందిన జీవాలి దేవి (90)తో గత 70 ఏళ్లుగా సహాజీవనం చేస్తున్నాడు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే సహాజీవనంలోనే కుటుంబ బాధ్యలతో బిజీగా అయిపోయి పెళ్లి విషయాన్ని మరచిపోయిన ఆ వృద్ధ దంపతులు… తమ జీవిత చరమాంకంలోనే అయినా పెళ్లి ముచ్చట తీర్చుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఈ మేరకు గ్రామపెద్దలు, కుటుంబసభ్యులు అందరూ మాట్లాడుకొని జూన్ 1న హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలకు శ్రీకారం చుట్టారు. 4వ తేదీన ఇద్దరికీ పెళ్లి చేసి డీజే పాటలు, నృత్యాలతో గ్రామంలో ఊరేగించారు. గత 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకొంది. పెళ్లితో నిమిత్తం లేకుండా పురుషుడు, మహిళ పరస్పర అంగీకారంతో కలిసి జీవించే ‘నత ప్రథ’ అనే ప్రాచీన సంప్రదాయం రాజస్థాన్లో పలుచోట్ల నేటికీ ఉంది. దాని ప్రకారమే వీరు 70 ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు.