Sharad Pawar : షిండే సర్కార్ ఉండేది ఆరు నెలలే – పవార్
సంచలన కామెంట్స్ చేసిన ఎన్సీపీ చీఫ్
Sharad Pawar : రెండున్నర ఏళ్ల పాటు పడుతూ లేస్తూ సాగించిన మరాఠా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసి కొత్తగా ఏక్ నాథ్ షిండే వర్గం, భారతీయ జనతా పార్టీ కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టగా మొత్తం 164 మంది సీఎం ఏక్ నాథ్ షిండేను బల పరుస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కొత్తగా కొలువు తీరిన షిండే ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరూ ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాటుతో సంతోషంగా లేరని అన్నారు.
ఆ మేరకు ఆరు నెలల తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు ఉండొచ్చని జోష్యం చెప్పారు శరద్ పవార్. ముంబైలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను ఉద్దేశించి పవార్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
షిండే ప్రభుత్వం కూలి పోయేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మనందరం మధ్యంతర ఎన్నికలకు సిద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు ఎన్సీపీ చీఫ్.
ఇప్పటి వరకు సీఎం, డిప్యూటీ సీఎం , స్పీకర్ పదవులు అయి పోయాయని కానీ ముందుంది ముసళ్ల పండగ అని అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే పూర్తి కేబినెట్ ను ప్రకటిస్తారో అప్పుడు పదవులు దక్కని వారు తిరిగి తిరుగుబాటు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు శరద్ పవార్(Sharad Pawar).
ఈ తరుణంలో ఎన్సీపీ సభ్యులు తమ తమ నియోజకవర్గాలలో ఫోకస్ పెట్టాలని ఈసారి మనమే పవర్ చేజిక్కించు కోవాలని సూచించారు.
Also Read : వాహనదారులకు షిండే ఖుష్ కబర్