తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్ప యాగానికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 15న పుష్పయాగం సందర్భంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహంనున్నట్లు తెలిపింది టీటీడీ. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహంచనున్నారు.
ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగి పోతాయని విశ్వాసం. మార్చి 14వ తేదీ నుండి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించిర జేఈవో వీరబ్రహ్మం. గృహస్తులు( ఇద్దరు) రూ.516/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చని తెలిపారు. పుష్ప యాగాన్ని పురస్కరించుకుని మార్చి 15న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
