Sudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డి

మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు - సుదర్శన్ రెడ్డి

 

 

తాను మంత్రి ప‌ద‌వి ఆశించిన మాట వాస్త‌మేన‌ని తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొన్ని స‌మీక‌ర‌ణాల వ‌ల్ల త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని చెప్పారు. సెక్రటేరియట్‌లో బుధ‌వారం ఉద‌యం ప్రభుత్వ సలహాదారుగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త‌న‌పై నమ్మకంతో అప్ప‌గించిన‌ బాధ్య‌తలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ స‌లహాదారు బాధ్య‌తలు అప్పగించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

”గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి జరగలేదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పనికిరాని పథకాల వల్ల తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 7వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర‌ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు.. ఉన్న పథకాలను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తామ‌”ని సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. అంతకుముందు త‌న కార్యాల‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో సుద‌ర్శ‌న్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆయ‌న‌కు మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ప‌లువురు ప్రజాప్రతినిధులు, ఉన్న‌తాధికారులు అభినందనలు తెలియజేశారు.

కాగా, మంత్రి వ‌ర్గంలో చోటు ఆశించి భంగ‌ప‌డ్డ సుద‌ర్శ‌న్‌రెడ్డితో పాటు కె. ప్రేంసాగ‌ర్‌రావుల‌కు కేబినెట్ హోదాతో ప్ర‌భుత్వం స‌రిపెట్టింది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు బాధ్య‌త అప్ప‌గిస్తూ.. సుద‌ర్శ‌న్‌రెడ్డిని స‌ల‌హాదారుగా నియ‌మించింది. పౌర‌స‌ర‌ఫరాల‌ సంస్థ చైర్మన్ ప‌ద‌విని ప్రేంసాగ‌ర్‌రావుకు క‌ట్ట‌బెట్టింది. మ‌రోవైపు కొత్త‌గా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న అజ‌హ‌రుద్దీన్‌కు మైనారిటీల సంక్షేమం, ప‌బ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది.

Leave A Reply

Your Email Id will not be published!