మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌ను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని, ఏ ఒక్క సీటు కోల్పోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌న్నారు. శ‌నివారం సీఎం టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. ఈ ఎన్నిక‌లు మ‌న‌కు అత్యంత ప్ర‌ధాన‌మ‌ని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్ప‌ష్టం చేశారు సీఎం. ఆయా ప్రాంతాల‌లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని, రెబల్స్‌ను బుజ్జగించాలని సూచించారు. అంతే కాకుండా టికెట్ల‌ను ఆశించి భంగ‌ప‌డిన వారిని, రెబ‌ల్స్ ను స‌ముదాయించాల‌ని అన్నారు.

నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి యునైటెడ్ స్టేట్స్ నుండి ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలను సమీక్షించారు. ప్రతి డివిజన్, వార్డులో విజయం సాధించడంపై స్పష్టమైన దృష్టితో తదుపరి కార్యాచరణను రూపొందించాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు , పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల‌కు ధీటుగా మ‌న అభ్య‌ర్థులు ఉండాల‌ని ఆదేశించారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. అంతేకాకుండా పార్టీకి అంతర్గత నష్టం జరగకుండా ఉండేందుకు రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపి, సమన్వయం ద్వారా సమస్యలను పరిష్కరించాలని నాయకులను ఆయన కోరారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు , డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!