హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజా పాలన పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నైని టెండర్ల రద్దు కాంగ్రెస్ పాలన కమీషన్లు దండుకునేందుకేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వారికి కిక్బ్యాక్లు, బొగ్గు కేటాయింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైని బ్లాక్ టెండర్లను ఆకస్మికంగా రద్దు చేయడం వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పాలన కమీషన్లు, కాంట్రాక్టులు, ప్రజాధనం దోపిడీకి సంబంధించిన పాలన అని తేలి పోయిందన్నారు.
బొగ్గు గనుల టెండర్లపై విచారణ కోరుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖలు రాసే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎస్సీసీఎల్లో తమ వారికి కాంట్రాక్టులు ఇవ్వడంలో సమానంగా బాధ్యత వహించిందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పక్షపాత వైఖరి, అవినీతి పాలన కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
ఎస్సీసీఎల్లో ఉద్యోగుల సంఖ్య 42,000కి పడి పోయిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అది మరింతగా 38,000కి పడి పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
