అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. అన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి నిధులూ మంజూరు చేయలేదని అన్నారు. జగన్ మాదిరిగా ప్రచార యావ కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదని, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వైసీపీ విషం కక్కుతోందని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపానని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ప్రకటిస్తే, జగన్ గాని, ఆయన పార్టీ నాయకులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేశామని, సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. దివ్వాంగులకు రూ.6 వేలకు, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరూ చదువుకునేలా తల్లికి వందనం పథకం అమలు చేశామని, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు.
