గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటేనే కార్యకర్తలు అని, వారు లేక పోతే పార్టీ మనుగడ సాధించడం అత్యంత కష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి సర్కార్ దాష్టీకాలను, అక్రమ కేసులను తట్టుకుని నిలబడ్డారని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని కోరారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్
తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను లోతుగా అవగాహన చేసుకోవడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీల సభ్యులు ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యలపై సమర్థవంతంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేతల అనుభవం ఈ శిక్షణల ద్వారా అందరికీ దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణా తరగతులు మరికొన్నింటిని దశల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. శిక్షణ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా 15 ఏళ్ల కుర్రాడిలో నారా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని, మనందరం ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు పల్లా శ్రీనివాసరావు.
