కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ బీజేపీ సర్కార్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఢిల్లీలో పాలనా పరంగా ఎవరికి నియంత్రణ ఉండాలనే దానిపై గత కొంత కాలంగా కేంద్రానికి , కొలువు తీరిన ఆప్ సర్కార్ కు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. చివరకు ఇరు పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
తాము ప్రజల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కానీ కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తమను ముప్పు తిప్పలు పెడుతోందంటూ వాపోయింది. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎవరికి సర్వ హక్కులు చెందుతాయనే దానిపై గురువారం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది .
ఈ వివాదంలో కేంద్రానికి ఝలక్ ఇచ్చింది. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికి అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ సర్కార్ కు అధికారాలు లేవన్న గత తీర్పును తోసి పుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో తాము ఏకీభవించ బోమంటూ స్పష్టం చేసింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకే సర్వాధికారాలు ఉంటాయని తెలిపింది.
శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీంతో ఆప్ లో సంతోషం వ్యక్తం అవుతోంది.
