హైదరాబాద్ : తెలంగాణ మట్టిలో మొలకెత్తిన గొంతుక, ప్రజా స్వరపేటిక గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ జయంతి ఇవాళ. ఆయన మన మధ్య లేరు. కానీ తను పాడిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. మనల్ని గాయపరుస్తూనే ఉంటాయి. చని పోయేంత వరకు తన శరీరంలో తూటాను మోసిన ఏకైక గాయకుడు ఈ ప్రపంచంలో ఒక్కడే. ఆయన జయంతి సందర్బంగా శనివారం ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు. ఈ సందర్బంగా గద్దర్ స్మృతి వనం వద్ద నివాళులు అర్పించారు. ప్రజా పోరాటాలలో , తెలంగాణ ఉద్యమంలో విప్లవ గాయకుడి పాత్రను గుర్తు చేసుకున్నారు. అంతే కాదు సామాజిక న్యాయానికి, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అపారమైన సేవను స్మరించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల పోరాటాలకు అంకితం చేశారని, సంస్కృతిని ప్రతిఘటనకు శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించారని అన్నారు. సమానత్వం, గౌరవం కోసం జరిగే పోరాటంలో గద్దర్ స్వరం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి సీతక్క గద్దర్ను తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి శిఖరంగా అభివర్ణించారు. ఆయన పాటలు, ప్రదర్శనలు నాలుగు కోట్ల మంది ప్రజల సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పాయని పేర్కొన్నారు. ఆ దిగ్గజ సాంస్కృతిక మూర్తికి ఆమె ప్రగాఢ నివాళులర్పించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, గద్దర్ తన జానపద వేషధారణ, కాలి గజ్జెలు , శక్తి వంతమైన ప్రదర్శనలతో తెలంగాణ ఉద్యమం రెండవ దశలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కళ, పాటల ద్వారా ప్రజల పోరాటాలకు దిశానిర్దేశం చేసిన “ప్రజా యుద్ధనౌక”గా ఆయనను అభివర్ణించారు.
