పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ నగరంలో ఉన్న శ్రీ వైకుంఠ ముఖద్వార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ ముఖ్య అతిథిగా బి.ఆర్. నాయుడు హాజరయ్యారు. ఈ ఆలయంలో మార్చి 7 నుండి 16 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మాణానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
ముందుగా కోల్కతా విమానాశ్రయానికి టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు చేరుకోగా, అక్కడి తెలుగు సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న చైర్మన్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం టిటిడి చైర్మన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు.
