విద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవో

విద్యా రంగ అభివృద్ధికి పాల‌క మండ‌లి ఆమోదం

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో టిటిడి విద్యా శాఖలో జీతాలు మినహా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.24.37 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.39.04 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.33.08 కోట్లు, 2024–25 సంవత్సరానికి రూ.25.99 కోట్లు, 2025–26 సంవత్సరానికి రూ.13.08 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులు చేపట్టారు.

ఈ ఏడాది 2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ , టిటిడి కలిపి విద్యాసంస్థలను మరింత ఆధునికరించి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మొత్తం రూ.118.89 కోట్లు కేటాయించారు. టిటిడి విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో టిటిడి విద్యా సంస్థల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈసారి భారీగా నిధులను కేటాయించారు. ఈ నిధులతో టిటిడి విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులు, వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి స్పోర్ట్స్, సాంస్కృతిక , సహ పాఠ్య కార్యకలాపాలు, టీచింగ్ , నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ ఓరియెంటెడ్ , వృత్తి ఆధారిత కోర్సులను అందుబాటులోకి తీసుకు రానున్నారు. అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలలో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విద్యాసంస్థల (ఎస్పీడబ్ల్యూ జూనియర్, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు)లో చదువుతున్న విద్యార్థినులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. టిటిడి పాలక మండలి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, టిటిడి జేఈవో (వైద్యం , విద్య) డా. ఎ. శరత్ పర్యవేక్షణలో టిటిడి విద్యా శాఖను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!