YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు పోలీసులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.
వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు పోలీస్ అధికారులు కారకులు. అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.
వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు – ఆదినారాయణ రెడ్డి
వైసీపీ నాయకులు జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అభివృద్ధిని ఓర్చుకోలేని జగన్… రాష్ట్రం, ప్రజలపై కుట్రలు చేస్తున్నారు. వైసీపీ అంతరించిపోయే పార్టీ.. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రండి. వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరు. వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు’’ అని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.
