న్యూఢిల్లీ : భారత క్రికెట్ టి20 జట్టు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా రికార్డ్ బ్రేక్ చేస్తూ ప్రపంచ క్రికెట్ లో పొట్టి ఫార్మాట్ లో నిర్వహించిన వరల్డ్ కప్ గెలుచు కోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఇదంతా కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించడం వల్లనే సాధ్యమైందన్నాడు. సంజు శాంసన్ జట్టులోకి వచ్చిన తర్వాత, మా ఆట గమనం పూర్తిగా మారి పోయిందన్నాడు. అతను ఆడిన తీరు చూస్తే, ఆ విజయం అతనికి దక్కాల్సిందేనని నేను భావిస్తున్నానని చెప్పాడు. శాంసన్ నిజంగా చాలా కష్టపడ్డాడు. అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత అతను ఆడిన తీరుతో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచాడని ప్రశంసించాడు సూర్య కుమార్ యాదవ్.
2025లో కూడా సంజు తన స్థానాన్ని కోల్పోవడం, ఆర్డర్ మార్చి బ్యాటింగ్ చేయడం, ఎక్కడ బ్యాటింగ్ చేసినా ఆ తర్వాత మళ్ళీ తన స్థానాన్ని కోల్పోవడం వంటివన్నీ జరిగాయి. ఇది నిజానికి ఆటగాడిని కలవర పెడుతుంది, అది నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఆస్ట్రేలియాలో నేను అతనితో నీకు ఇష్టం లేని వేరే స్థానంలో ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు. అయినా నువ్వు జట్టు కోసం అలా చేస్తున్నావు, అది ప్రశంసనీయం అని నేను అనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చింది. అది చాలా కష్టమైనప్పటికీ, నేను చేయగలిగింది ఇదే కాబట్టి నేను అతనికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చిందన్నాడు సూర్య కుమార్ యాదవ్. నేను జట్టు కోణంలో కూడా ఆలోచించగలిగాను. ఈ విషయాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి, ఆ తర్వాత అత్యంత అవసరమైన సమయంలో శాంసన్ తప్పకుండా రాణిస్తాడని రాసి పెట్టిందన్నాడు.
