అమరావతి : మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింప బడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం అని పేర్కొన్నారు . అందుకే అన్న దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి మహిళలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహిళా యూనివర్శిటీని ప్రారంభించారని అన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించారని ప్రశంసించారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన పాలనలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు మంత్రి ఎస్ సవిత.
విద్యా, ఉద్యోగావకాశాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అంతే కాకుండా రాజకీయాల్లోనూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మహిళలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా భరోసా ఇస్తూ పథకాలు రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్య కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని పేర్కొన్నారు ఎస్. సవిత. కట్టెల పొగతో వంటింటిలో ఉక్కిరిబిక్కిరయ్యే మహిళల కోసం దీపం పథకానికి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. గతంలో దీపం 1, దీపం 2 ఇపుడు దీపం 3 పథకం కింద ఏడాదిగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడకైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన ఘనత సీఎం చంద్రన్నదని అన్నారు.
