వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వెలువడిన ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారంటూ పేర్కొన్నారు. మత, కుట్ర రాజకీయాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారని తెలిపారు.
ప్రజలను అమాయకులను చేసి ఓట్లను కొల్లగొట్టాలని అనుకోవడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆ విషయం ప్రతి పార్టీ తెలుసు కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.
కులం, మతం, డబ్బు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని కుండ బద్దలు కొట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో రాచరిక పాలన సాగిస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీకి, దాని చీఫ్ సీఎం కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.
బీజేపీకి సంబంధించి చేసిన తప్పిదాలే ఆ పార్టీ కొంప ముంచాయని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దె దించేందుకు ఎదురు చూస్తారని తెలిపారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతోందంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
