Munugodu By Poll Comment : మునుగోడులో మునిగేది ఎవరో
ముగిసిన ప్రచారం మిగిలింది ఫలితం
Munugodu By Poll Comment : దేశంలో చాలా చాట్లో ఉప ఎన్నికలు జరుగుతున్నా కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం మునుగోడు ఉప ఎన్నికపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటోంది. కారణం ఇక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగడమే.
ఒకరిపై ఎత్తులు పై ఎత్తులు, ఆరోపణలు, విమర్శలు, కేసులు, దాడులు, నోట్ల కట్టలు, మద్యం ..ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత ఖరీదైన ఎన్నికగా
మారి పోయింది. గతంలో హుజూరాబాద్ లో భారీ ఎత్తున కాషాయం, గులాబీ పార్టీలు ఖర్చు చేశాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది.
అక్కడ మాజీ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేశారు. సవాల్ విసిరారు. కాలికి బలపం కట్టుకుని తిరిగాడు. ఆత్మ గౌరవానికి
ఆధిపత్యానికి మధ్య యుద్దంగా ప్రకటించారు. ఆ సెంటిమెంట్ ను రగిలించడంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యాడు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెట్టక పోవడం అడ్వాంటేజ్ గా మారింది. ఇది పక్కన పెడితే మునుగోడులో కోరి కొని తెచ్చుకున్న ఎన్నిక ఇది. పనులు లేక, ఉద్యోగాలు దొరకక , ఉపాధి అందక నానా తంటాలు పడుతున్న ప్రజలకు ఉప ఎన్నిక అన్నది ఒక అంది వచ్చిన అవకాశంగా మారింది.
విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలక వర్గం, ఉన్నతాధికారులు, కేబినెట్ మొత్తం ఇక్కడే కొలువు తీరడం విస్తు
పోయేలా చేసింది. మరో వైపు కేంద్రం నుంచి బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఎక్కడ చూసినా నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా బయట పడ్డాయి.
ఇంకా పడుతూనే ఉన్నాయి.
నవంబర్ 1 మంగళవారం నాటితో ప్రచారానికి తెర పడింది. మొత్తం 2 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బరిలో నిలిచిన ప్రధాన పార్టీలకు
సంబంధించి అభ్యర్థులంతా బహుజన వర్గాలకు చెందిన వారు లేక పోవడం విశేషం.
టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి. ఇక బీఎస్పీ నుంచి విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు. ఇక బరిలో ఎందరున్నా ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంటుందనేది వాస్తవం.
ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే ఉంటోంది. కానీ ఈ ఇద్దరిలో ఎవరు గెలవాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి చీల్చే ఓట్లపైనే ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. ఈ తరుణంలో కేంద్ర హోం శాఖ మంత్రి , ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇక్కడ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడేందుకు బీజేపీకి మార్గం ఏర్పడుతుంది. ఇక ఇటీవలే భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి దేశ
రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్న టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ప్రతిష్టకు, నాయకత్వ నైపుణ్యానికి ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది.
ఈ తరుణంలో ఇక్కడ గెలిస్తే బీజేపీకి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొత్తంగా ఎవరు గెలిచినా ఒరిగేది ఏమీ ఉండదనేది
వాస్తవం. మొత్తంగా మునుగోడులో(Munugodu By Poll) మునిగేది మాత్రం ప్రజలేనని గుర్తిస్తే మంచిది.
ఇకనైనా అంబేద్కర్ చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకోవాలి. ఓటు ఆయుధం దానిని పని చేసే వాళ్లకు వేయాలి..అమ్ముడు పోయే వాళ్లకు..అమ్మే వాళ్లకు కాదని తెలుసు కోవాలి.
Also Read : ఓటు ఆయుధం మనదే విజయం