ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ భారీ పరుగులతో దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 235 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 186 పరుగులకే పరిమితమైంది. 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్ 16వ సీజన్ లో సీఎస్కే 5 మ్యాచ్ లు గెలుపొంది పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్లింది. 5వ స్థానంలో నిలిచింది . ప్రారంభ మ్యాచ్ లో అపజయం పొందినా ఆ తర్వాత పుంజుకుంది ధోనీ సేన.
236 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో మరోసారి సత్తా చాటాడు యూపీ కుర్రాడు రింకూ సింగ్. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఆటగాడు జేసన్ రాయ్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ జట్టును గెలిపించ లేక పోయాడు. చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు.
రింకూ సింగ్ కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. జేసన్ రాయ్ తో కలిసి ఐదో వికెట్ కు ఏకంగా 65 రన్స్ జోడించారు. ఎప్పుడైతే జేసన్ రాయ్ వెనుదిరిగాడో కోల్ కతా ఆశలు వదులుకుంది. మొత్తంగా ఐపీఎల్ లో ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తిని రేపింది.