కేరళ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా మారిన తమ కేరళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆట తీరు పట్ల ప్రశంసలు కురిపించాడు. తనను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందన్నాడు. నేను శాంసన్ ను మొదటిసారి కలిసినప్పుడు అతని వయసు 14 ఏళ్ళు. పెద్ద చిరునవ్వుతో, అపారమైన ప్రతిభతో ఉన్న ఒక యువ క్లబ్ క్రికెటర్. అప్పటికే వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణిస్తున్నాడు. నువ్వే తర్వాతి ధోనీ అవుతావని నేను కొంత గర్వంగా చెప్పాను. సంవత్సరాల తర్వాత, గౌతమ్ గంభీర్ తనను సరిదిద్దుతూ, ‘నువ్వు తర్వాతి ధోనీ కానవసరం లేదు, నువ్వు ఒకే ఒక్క సంజు సామ్సన్గా ఉంటావు’ అని అన్నారు. ఇప్పుడు అతను సరిగ్గా అదే అయ్యాడని ప్రశంసలతో ముంచెత్తారు శశి థరూర్.
సంజూ శాంసన్ ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. అతను అద్భుతమైన విజయాన్ని సాధించాడు. నిశ్శబ్దంగా, వినయంగా, ఆడంబరం లేకుండా ఉండే సమర్థవంతమైన నాయకుడు. అతను చాలా సంవత్సరాలు రాజస్థాన్ రాయల్స్కు అద్భుతంగా నాయకత్వం వహించాడు. మరీ ముఖ్యంగా, అతను భారత బ్యాటింగ్ ఆర్డర్ ఆరంభంలో స్థిరత్వాన్ని, పట్టును అందించాడు. అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, తనను తాను నిగ్రహించుకుంటే, అతనిలోని అసలైన ప్రతిభ బయట పడుతుందని నేను ఎప్పుడూ భావించేవాడిని అని అన్నాడు ఎంపీ శశి థరూర్. జింబాబ్వేతో జరిగిన ఆ మ్యాచ్లో అతన్ని చూసినప్పుడు, ఆ రోజు అతను ఫామ్లో ఉన్నాడని నాకు మొదటి నుంచే అర్థమైందన్నాడు. ఇవాళ ఇండియా వరల్డ్ కప్ సాధించడంలో, విశ్వ విజేతగా నిలవడంలో శాంసన్ కీలకమైన పాత్ర పోషించాడని ఇక తనకు తిరుగు లేదన్నాడు ఎంపీ.
