జగన్ బెస్ట్ సీఎం.. అంటున్న ఒక తాజా సర్వే
టీడీపీ కొంత మెరుగైంది..బీజేపీకి పెరిగిన పట్టు.. జనసేనకు తగ్గిన ఓటు బ్యాంకు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు మీడియా పోరాటం, మధ్యలో అమరావతి పోరాటం..వీటన్నింటి మధ్య జగన్ పనైపోయిందంటూ వస్తున్న వార్తలు, చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పుతాడంటూ నినాదాలు పెరిగిపోతున్న దశలో ఆంధ్రప్రదేశ్ లో తాజాగా వీడీపీ అసోసియేట్స్ ఆర్ అండ్ డీ అనే ప్రైవేటు ఏజెన్సీ ఒక సర్వే చేసింది.
అందులో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ముఖ్యమంత్రి జగన్ పనితీరును 74 శాతం మెచ్చుకున్నారు. 26శాతం పెదవి విరిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓటింగు కన్నా 3.02 శాతం పెరిగి.. 52.97 శాతం వచ్చింది. తెలుగుదేశానికి పట్టు సడలిపోలేదు. గత ఎన్నికలతో పోలిస్తే.089 పెరిగి.. 40.06 శాతానికి వచ్చింది. జనసేన మైనస్ లో పడింది..5.53శాతం ఓటింగు ఉంటే..ఈ సర్వేలో 3.56శాతానికి పడిపోయింది. బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుంది. మొన్న ఎన్నికల్లో 0.89శాతం ఉన్న ఓటింగు ఇప్పుడు 2.20 శాతానికి పెరిగింది అనే చెప్పాలి.
జగన్ సర్కార్ కు సరైన ప్రత్యర్థి ఎవరని అంటే బీజేపీ అని 8శాతం చెప్పగా..జనసేనాని పవన్ కల్యాణ్ అని 4శాతం చెప్పడం విశేషం. ఈసర్వేను బట్టి చూస్తే జన సేన మిత్ర పక్షం బీజేపీ బలం పెరిగింది అనే చెప్పాలి. ఇలాగే చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ విజయకేతనం ఎగురవేసేలాగే కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ, వైసీపీ మధ్య బలమైన మైత్రీబంధం కనిపిస్తోంది. తెలుగుదేశం వ్యూహాలు ఫలించకపోగా వికటించడం ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.