CEO Google : గూగుల్ సిఇఓకు ముంబై పోలీస్ షాక్ 

కోర్టు ఆదేశాల‌తో ఎఫ్ఐఆర్ న‌మోదు 

CEO Google : కొత్త ఏడాది అచ్చొచ్చిన‌ట్లు లేదు టెక్ సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్(CEO Google) కు. ముంబై పోలీసులు ఇవాళ కేసు న‌మోదు చేశారు. కోర్టు ఆదేశాల దెబ్బ‌కు కేసు నమోదు చేయాల్సి వ‌చ్చిందంటూ వెల్ల‌డించారు పోలీసులు.

పిచాయ్ తో పాటు గూగుల్ కంపెనీకి చెందిన మ‌రో ఐదుగురిపై కూడా కేసు న‌మోదు చేయ‌డం విశేషం. కాగా కాపీ రైట్ చ‌ట్టాన్ని ఉల్లంఘించినందు వ‌ల్ల‌నే స‌ద‌రు సంస్థ సిఇఓతో పాటు ఇత‌ర అధికారుల‌పై కేసు న‌మోదైన‌ట్లు స‌మాచారం.

ఇక కేసుకు సంబంధించి విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ సునీల్ ద‌ర్శ‌న్ ఏక్ హ‌సీనా థీ ఏక్ దివానా థా అనే మూవీని తీశాడు. దీనిని త‌న అనుమ‌తి లేకుండా గూగుల్ కు చెందిన యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని, దీని వ‌ల్ల తాను రోడ్డు పాలైన‌ట్లు వాపోయాడు ద‌ర్శ‌కుడు.

ఈ మేర‌కు త‌న‌కు న్యాయం చేయాల్సిందంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. త‌న సినిమా రైట్స్ ఎవ‌రికీ తాను అమ్మ లేద‌ని కోర్టుకు విన్న‌వించాడు. తాను అప్పులు చేసి ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమాను తెరకెక్కించానంటూ వాపోయాడు ద‌ర్శ‌కుడు.

తాను రిలీజ్ చేసే కంటే ముందే యూట్యూబ్ లో అప్ లోడ్ చేశార‌ని, దీంతో త‌న‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లిందని ఈ విష‌యాన్ని తాను యూట్యూబ్ నిర్వాహ‌కుల‌కు తెలిపాన‌ని ఆధారాల‌తో స‌హా తెలిపాడు ద‌ర్శ‌న్.

అయితే అక్క‌డి నుంచి కూడా త‌న‌కు స‌రైన స‌మాధానం రాలేద‌ని ఆవేద‌న చెందాడు. ఇదిలా ఉండ‌గా త‌ను తీసిన సినిమా పూర్తిగా బి – గ్రేడ్ కు చెందిందంటూ మ‌రికొంద‌రు ద‌ర్శ‌కుడిపై కామెంట్ చేయ‌డం విశేషం.

2007లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎత్తి పోయింది. కావాల‌నే ద‌ర్శ‌కుడు ఇలా చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు కొంద‌రు.

Also Read : బాధ్య‌త‌లు స్వీక‌రించిన విశాల్ గార్గ్

Leave A Reply

Your Email Id will not be published!