కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 224 సీట్లకు గాను 137 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేకుండానే ఒంటరిగానే అధికారంలోకి వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. సీఎంగా ఉన్న బస్వరాజ్ బొమ్మై గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆదివారం సాయంత్రం ఎన్నికైన ఎమ్మెల్యేలతో సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ మెజారిటీ రాక పోయినట్లయితే ఇబ్బంది ఏర్పడేది. ఇక కింగ్ పిన్ గా వ్యవహరించాలని ఆశించిన జేడీఎస్ కుమార స్వామికి కోలుకోలేని షాక్ ఇచ్చారు కన్నడ ప్రజలు.
ఓ వైపు మోదీ , అమిత్ షా, జేపీ నడ్డా, యడ్యూరప్ప అతిరథ మహారథులు ప్రచారం చేసినా బీజేపీ గట్టెక్కలేక పోయింది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన స్లోగన్ 40 పర్సెంట్ కమీషన్ సర్కార్ బాగా పని చేసింది. ఇక భారీ మెజారిటీతో గెలుపొందినా సీఎం ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఒకరు సిద్దరామయ్య మరొకరు డీకే శివకుమార్.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సైతం కీలకంగా మారనున్నారు. ఇవాళ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లోనే కాదు ఇతర పార్టీలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి ఎవరు సీఎం అవుతారని.
