హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. యువతకు వివిధ అంశాలపై నైపుణ్యాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలోని ఆయన ఛాంబర్లో నిర్వహించిన బడ్జెట్ ప్రిపరేటరీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక, ఈఎస్ఐ, ఉపాధి–శిక్షణ శాఖలకు సంబంధించిన బడ్జెట్ అవసరాలను వివరించారు. సంబంధిత శాఖల పనితీరును మరింత బలోపేతం చేయడానికి అవసరమైన నిధులను కేటాయించాలని ఆయన కోరారు. కార్మిక శాఖ కార్మికుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పని చేస్తోందని మంత్రి తెలిపారు.
కొత్త యుగ సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించడం ఉపాధి–శిక్షణ శాఖకు ప్రాధాన్యతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల (ATCs) ద్వారా యువతకు ఆధునిక పరిశ్రమలకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.అలాగే, విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ATCsలో భాషా శిక్షణ కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో విదేశీ నియామకాల విషయంలో ఇవి గేమ్ చేంజర్గా మారనున్నాయని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధి–శిక్షణ శాఖ అధికారులు బడ్జెట్ అవసరాలు, కొత్త ప్రతిపాదనల వివరాలను సమావేశంలో వివరించారు.
ఈఎస్ఐ శాఖకు సంబంధించి కార్మికులకు (Insured Persons) సమయానుకూలంగా, నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందించడం తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కార్మిక శాఖ కమిషనర్ పామెలా సత్పతి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ మిస్ కాంతి వెస్లీ, టీజీఎండీసీ డైరెక్టర్ భావేష్ మిశ్రా, గనుల శాఖ కార్యదర్శి ఎన్. శ్రీధర్ , కార్మిక–ఉపాధి శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు
