AP Deputy CM : టీటీడీ ఆస్తులను దోచేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది

టీటీడీ ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందని చెప్పారు...

AP Deputy CM : తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారని అన్నారు. ఆ ఆస్తులను వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను… భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. భక్తులు ఇచ్చిన ఆస్తులను విక్రయించాలని గత టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.

అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికే ప్రయత్నించిందని మండిపడ్డారు. టీటీడీ(TTD)ని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్(AP Deputy CM) స్పష్టం చేశారు.

AP Deputy CM Comment..

టీటీడీ ఆస్తుల విషయంలో గతంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరారు. గత పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని చూసిందని అన్నారు. ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారని చెప్పారు. టీటీడీ ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందని చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఉన్న టీటీడీ(TTD) ఆస్తులను దోచేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించాయని పవన్ కళ్యాణ్(AP Deputy CM) చెప్పారు. తిరుమల శ్రీవారికి రాజులు, భక్తులు కొన్ని శతాబ్దాలుగా నగలు, ఆభరణాలు అందజేశారని తెలిపారు. ఆ ఆభరణాల జాబితాను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు. స్థిరాస్తులను అమ్మేయాలని చూసినవారు శ్రీవారి ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా ఉన్నారా లేదే అనేదానిపై దృష్టిపెట్టాలని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి స్పెషల్ దర్శనం కోసం రూ.10,500 తీసుకున్నారని.. భక్తులకు మాత్రం బిల్లు రూ.500కే ఇచ్చారని చెప్పారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్లు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మిస్తామని అప్పటి పాలకులు చెప్పారని అన్నారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? ఆ సంస్థ ఏమిటి? అనే అంశాలపై సీఎం చంద్రబాబు విచారణ చేపట్టాలని కోరారు. ఎంత మేరకు శ్రీవాణి ట్రస్ట్ ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియజేయాలని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read : Sri Lanka : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనురా కుమార..

Leave A Reply

Your Email Id will not be published!