తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్ ను ఏకి పారేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. కానీ బండి ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలోనూ కాషాయ జెండా ఎగరలేదు. దీంతో తెలంగాణలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో బాగంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేకంగా కర్ణాటకలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థుల తరపున పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. కానీ ప్రజలు ఊహించని రీతిలో బీజేపీకి బై చెప్పారు. కాంగ్రెస్ కు జై కొట్టారు.
బండి సంజయ్ కర్ణాటకలోని బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న కోలర్, చింతామణి, ముల్బగల్ , బాగేపల్లి, గౌరీ బిదనూర్, చిక్క బల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ మొత్తం నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 3వ లేదా 5వ స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతం 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 127 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది. బీజేపీ 67కి పరిమితమైంది.
