ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కలవడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు హైకమాండ్ కు చేరవేస్తామని తెలిపారు. అంతిమ నిర్ణయం పూర్తిగా అధినాయకత్వం చేతుల్లో ఉంటుందని కుండ బద్దలు కొట్టారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా ప్రయత్నం చేయాలని, ఈ మేరకు టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బావుంటుందని జనసేన చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారని చెప్పారు జీవీఎల్. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా ప్రస్తావించారని స్పష్టం చేశారు.
పవన్ ప్రతిపాదనపై జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు. పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనేది తేల్చాల్సి ఉందన్నారు జీవీఎల్ నరసింహారావు. వాళ్లు చెప్పిందే తాము పాటిస్తామని చెప్పారు ఎంపీ. బీజేపీలో తమ ఓటు చీలి పోలేదన్నారు. ఎప్పటిలాగే ఉందని తెలిపారు.
