తిరుమల : శ్రీవారి ఆలయంలో ఈనెల 25న రథ సప్తమి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉండవన్నారు. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పారు. రథ సప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారీ. గ్యాలరీల్లోని భక్తులందరికీ 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు అన్న ప్రసాదాలు అందేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు.
వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగించు కోనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. భద్రతకు సంబంధించి STANDARD OPERATION PROCEDURE ను అనుసరిస్తూ టీటీడీ భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రత పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాలు లాగే ఈసారి కూడా తిరుమలలో జరిగే రథసప్తమి సందర్బంగా కేవలం సామాన్య భక్తులకే అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
