దావోస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్శిటీకి ప్రముఖ సంస్థ సిస్కో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సంస్థ ఈ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా సిస్కోకు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. గత సంవత్సరం రాష్ట్రంతో కంపెనీ చేసుకున్న అవగాహన ఒప్పందం కింద తదుపరి కార్యాచరణ ప్రణాళికలపై కూడా సమావేశంలో చర్చించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తనను తాను ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న కేంద్రంగా నిలబెట్టుకుంటోందని అన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు ,ప్రతిభకు కేంద్రంగా నిలుస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సిస్కో ప్రపంచ నాయకత్వంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్చలు జరిపింది. తెలంగాణ కోసం సిస్కో భవిష్యత్తు ప్రణాళికలలో పూర్తి సహకారాన్ని ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది, రాష్ట్రం ఆర్థిక శక్తి గా ,పారిశ్రామిక వృద్ధికి డైనమిక్ కేంద్రంగా తన ఖ్యాతిని సంపాదించిందని నొక్కి చెప్పింది. సిస్కోలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గై డైడ్రిచ్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. గత మార్చి 2025లో, సిస్కో తెలంగాణ ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ , తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో బహుళ అవగాహన ఒప్పందాలపై సిస్కో సంతకం చేసింది. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ టెక్నాలజీ, తదితర వాటిపై శిక్షణ ఇవ్వనుంది.
