DK Shiva Kumar Sood : శివకుమార్ టార్గెట్ సూద్ కు బిగ్ పోస్ట్
అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని వార్నింగ్
కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ కు కీలక పోస్టు దక్కింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఆయన చీఫ్ కాబోతున్నారు. ప్రధాని మోదీ, సీజేఐ చంద్రచూడ్, ప్రతిపక్ష నేత ఖర్గే తో కూడిన త్రిసభ్య కమిటీ చివరకు ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు సీబీఐ చీఫ్ గా జైశ్వాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే ప్రవీణ్ సూద్ కొలువు తీరనున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రవీణ్ సూద్ పై నిప్పులు చెరిగారు ఒకనాడు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్. తాము గనుక అధికారంలోకి వస్తే సూద్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
224 సీట్లకు గాను కాంగ్రెస్ ఒక్కటే 136 సీట్లను కైవసం చేసుకుంది. ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు డీకే శివకుమార్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఉన్నారు. ఈ తరుణంలో సూద్ కు సీబీఐ చీఫ్ గా ఎంపిక కావడంతో ఇద్దరి మధ్య మరోసారి వార్ కొనసాగుతుందా లేక మౌనంగా ఉంటారా అన్నది చూడాలి.
