అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన భారత ఓపెనర్లు దుమ్ము రేపారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిన్నటి దాకా విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ సత్తా చాటాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇక కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. తను 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. భారీ స్కోర్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఇంకో వైపు అభిషేక్ శర్మ తక్కువ తినలేదు. తను 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లో ఆడిన భారత జట్టునే తిరిగి ఫైనల్ మ్యాచ్ లో కొనసాగిస్తున్నట్లు ప్రకటించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇక సంజూ శాంసన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. వరల్డ్ కప్ టోర్నీ ఫార్మాట్ లో సంజు సామ్సన్ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్లలో, సెమీఫైనల్ , ఫైనల్లో యాభై పరుగులు చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ , షాహిద్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అభిషేక్ అవుట్ అయ్యాక మైదానంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ సూపర్ షో చేశాడు. తను కూడా ఉతికి ఆరేశాడు. 25 బాల్స్ ఎదుర్కొని 54 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆఖరులో వచ్చిన శివమ్ దూబే శివాలెత్తాడు. తను కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొని 26 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 256 లక్ష్యాన్ని నిర్దేశించింది.
