Indian Defaulters Comment : ఆర్థిక నేరగాళ్లు ‘దొరబాబులు’
50 బడా బాబులు రూ. 92 వేల కోట్లు
Indian Defaulters Comment : మనం అప్పులు చేయాలంటే భయపడతాం. కనీసం ఏదైనా అవసరం ఉండి రుణం తీసుకునేందుకు జంకుతాం. నానా తంటాలు పడతాం. వడ్డీలు కట్టలేక తల్లడిల్లి పోతాం. పోనీ అన్నీ ఉన్నా బ్యాంకులకు వెళ్లాలంటే భయాందోళనకు లోనవుతాం.
అష్టకష్టాలు పడి ఎలాగో లోన్ తీసుకోవాలంటే నానా తిప్పలు. ఒక్కోసారి కన్నీళ్లు కూడా వస్తాయి. సవాలక్ష నిబంధనలు పెడతారు. అన్నీ సరిగానే ఉన్నా రుణం ఇచ్చేందుకు తిప్పించుకుంటారు బ్యాంకర్లు. ఇది సగటు భారతీయుడి కథ.
ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చిందే. ఇది పక్కన పెడితే ఒకటా రెండా ఏకంగా 92 వేల కోట్లకు పైగా ఉద్దేశ పూర్వకంగా ఆర్థిక నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు శఠగోపం(Indian Defaulters) పెట్టారు.
ఒక రకంగా ప్రజలు కష్టపడి ఆయా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కొట్టేశారు. ఏకంగా శిక్ష పడకుండా విదేశాలకు చెక్కేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవర్ లోకి వచ్చాక నోట్లను రద్దు చేశారు.
డిజిటలైజేషన్ జపం చేస్తున్నారు. ఆపై అక్రమార్కుల భరతం పడతానని ప్రకటించారు. కానీ ఒక్క ఆర్థిక నేరస్థుడిని ఇండియాకు రప్పించ లేక పోయారు.
ఈ దేశంలో చోటు చేసుకున్న చట్టాల్లోని లోపాలను ఆధారంగా చేసుకుని ఆర్థిక నేరగాళ్లు బడా బాబులుగా చెలామణి అవుతున్నారు. దర్జాగా కొల్లగొట్టిన కోట్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
వీరిని పట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మన పోలీసులు. ఇలా 92 వేల కోట్లకు పైగా కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్ల జాబితాను పార్లమెంట్ సాక్షిగా చదివి వినిపించారు కేంద్ర మంత్రి. మొత్తం చూస్తే 50 మంది మాత్రమే. కానీ కొల్లగొట్టింది తొంబై రెండు వేల కోట్లకు పైగానే.
తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. వీళ్లంతా వ్యాపారం పేరుతో రుణాలు పొందారు. దానికి అందమైన ముసుగు తగిలించుకున్నారు. పాలకులతో అంటకాగారు. వీటన్నింటిని ఇప్పుడు కట్టే స్థితుల్లో ఉన్నారంటే పొరపాటు పడినట్లే.
రూ. 7,800 కోట్లకు పైగా మోసం జరిగిన జాబితాలో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉంది. డిఫాల్టర్ల జాబితాలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ పేర్లు ఉండడం విశేషం. నీరవ్ కు చెందిన ఫైర్ స్టార్ రూ. 803 కోట్లతో 49వ స్థానంలో(Indian Defaulters) ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో బ్యాంక్ జారీ చేసిన రూ. 10,000 కోట్ల అండర్ టేకింగ్ కు సంబంధించిన నకిలీ లేఖతో ముడిపడి ఉన్నారు ఈ ఇద్దరు.
ఇక వీరితో పాటు ఐఆర్ఏ ఇన్ ఫ్రా రూ. 5,879 కోట్లు, ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,803 కోట్లు, ఏబీజీ షిప్ యార్డు రూ. 3,708 కోట్లు, విన్సమ్ డైమంట్స్ రూ. 2,931 కోట్లు, రోటోమాక్ గ్లోబల్ రూ. 2,893 కోట్లు కొల్లగొట్టిన జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడవుతుంది. మరి వీళ్లు చేసిన ఈ మోసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇకనైనా మోదీ సర్కార్ కళ్లు తెరవాలి. బడా బాబుల బండారం బయట పెట్టాలి. లేదంటే వీరిని జీవిత ఖైదీలుగా ప్రకటించాలి.
Also Read : మద్యం కుంభకోణం కిం కర్తవ్యం