అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. అరుదైన ఘనతను సాధించింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ లో 96 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. గతంలో ఉన్న రికార్డులను తిరగ రాసింది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో కీవీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. టోర్నీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ రెచ్చి పోయాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇదే సమయంలో ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు పొందిన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ రికార్డు బ్రేక్ చేశాడు. తను మరోసారి సూపర్ షో చేశాడు. క్వార్టర్ ఫైనల్ లో విండీస్ తో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో సెమీస్ కు చేర్చాడు. ఇదే క్రమంలో ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించాడు. తను 89 రన్స్ చేశాడు. తాజాగా న్యూజిలాండ్ బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 8 సిక్సులు 5 ఫోర్లతో విరుచుకు పడ్డాడు. 89 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులు చేస్తే శివమ్ దూబే 26 పరుగులతో షాక్ ఇచ్చాడు. అనంతరం 256 పరుగుల భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ బొక్క బోర్లా పడింది. 159 పరుగులకే చాప చుట్టేసింది. ఇండియన్ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా తన సత్తా ఏమిటో చూపాడు. 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు.
