హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడని, ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదన్నారు. ఇప్పుడు ఆ కార్డు ఎక్కడ పెట్టుకోవాలో ప్రజలకు అర్థం అవ్వడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి సంచులు మోసుడు, పదవులు కాపాడుకునుడు తప్ప కాంగ్రెస్ వాళ్లకి ఏమీ చేతకాదన్నారు. సింగరేణి టెండర్ల స్కాంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ స్కామ్లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేవలం కేంద్ర మంత్రి అజ్ఞానమా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అన్న కేటీఆర్
తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట పడినా, కేంద్ర మంత్రిగా మీరు చర్యలు తీసుకోక పోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన ముఖ్యమంత్రి తానే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ కాదా అని నిలదీశారు. పట్టపగలు దోపిడీ చేసిన దొంగ ఎక్కడైనా స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తనపైనే విచారణ జరపాలని కోరతాడా? అని నిలదీశారు. సింగరేణి స్కామ్లో ఇదే తరహా విచిత్రమైన వాదనను కేంద్ర మంత్రి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సైట్ విజిట్ నిబంధనను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తీసుకొచ్చింది తన బావమరిదికి టెండర్లు అప్పనంగా అప్ప జెప్పేందుకేనని తెలిసినా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఇంకా దాగుడు మూతలు ఆడటానికి కారణం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
