ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. నితీశ్ రాణా కెప్టెన్సీ లోని కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించింది. పూర్తిగా మ్యాచ్ ఏక పక్షంగా సాగింది. వార్ వన్ సైడ్ గా మారింది.
ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో మెరుగైన రన్ రేట్ కారణంగా 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది రాజస్థాన్ రాయల్స్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసింది కోల్ కతా నైట్ రైటర్స్.
రాజస్థాన్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో హోరెత్తించారు. దీంతో కోల్ కతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. ఓ వైపు వికెట్లు రాలుతుంటే మరో వైపు వెంకటేశ్ అయ్యర్ 57 రన్స్ చేస్తే నితీశ్ రాణా 22 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆదుకున్నారు. గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేశారు.
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏ మాత్రం తగ్గలేదు. యంగ్ స్టార్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జోస్ బట్లర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ 29 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
