హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నెలాఖరు లోగా లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేపట్ట వలసిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారికి మార్గ నిర్దేశనం చేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలో ఒక బెంచ్ మార్క్గా నిలవబోతోందని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుందని చెప్పారు. మొదటి దశలో రాష్ట్ర మంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారుల సమ్మతి తీసుకొని, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు మంత్రి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక సరఫరా చేస్తోందని చెప్పారు. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు ఉండాలన్నారు. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నిర్మాణ సామాగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక ఒకటి లేదా రెండు విడతల్లో చెల్లింపులు జరిగిన తరువాత, వివిధ కారణాలతో చెల్లింపులు ఆగిపోతే..అటువంటి చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలన్నారు. లేక పోతే చర్యలు తప్పవన్నారు.