ఝార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ కాబోతున్నారు. తన క్రికెట్ కెరీర్ లో ఐపీఎల్ 16వ సీజన్ కానుందా. అవుననే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు ధోనీ. కోట్లాది మంది అభిమానులను కలిగిన ఈ దిగ్గజ క్రికెటర్ ఏది చేసినా అది సంచలనమే.
ఎక్కడికి వెళ్లినా, ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా ధోనీ జపమే జపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అత్యంత సాధారణ కుటుంబం నుంచి అత్యున్నతమైన భారత క్రికెట్ జట్టుకు నాయకుడిగా ఎదిగిన ధోనీ ఎన్నో విజయాలు అందించాడు. ఆయన పేరుతో ఎన్నో రికార్డులు ఉన్నాయి.
తాజాగా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో తన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 235 పరుగులు చేసింది. కోల్ కతా 186 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాచ్ విజయం సాధించిన అనంతరం సీఎస్కే స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడారు.
అభిమానులను మరిచి పోలేనని, వారు కూడా తనకు వీడ్కోలు పలికేందుకు సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. నెట్టింట్లో ధోనీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.