Nara Lokesh : ఏపీలో జ‌గ‌న్ ప‌నై పోయింది – లోకేష్

రాబోయేది తెలుగుదేశం రాజ్యం

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇవాల్టితో 99వ రోజుకు చేరుకుంది. శ్రీ‌శైలంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు నారా లోకేష్. ఏపీలో జ‌గ‌న్ ప‌నై పోయింద‌ని , ఆయ‌న‌కు సీఎంగా పాలించే అర్హ‌త కోల్పోయాడ‌ని అన్నారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

రాబోయేది తెలుగుదేశం రాజ్య‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. తాము వ‌చ్చాక అంత‌కు అంత బ‌దులు తీర్చుకుంటామ‌ని, వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని హెచ్చ‌రించారు నారా లోకేష్. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టించాడ‌ని, మాయ మాట‌లు న‌మ్మిన ప్ర‌జ‌ల‌కు చెవుల్లో పూలు పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. ఆత్మ‌కూరు చెంచుకాల‌నీ నుంచి యాత్ర ప్రారంభ‌మైంది. ఇందులో భాగంగా తెలుగు గంగ ప్రాజెక్టును లోకేష్ ప‌రిశీలిస్తారు. రాత్రి బోయ రేవుల వ‌ద్ద బ‌స చేస్తారు.

హైకోర్టు ఇటీవ‌ల రాష్ట్ర స‌ర్కార్ ఇచ్చిన జీవో నెంబ‌ర్ 1ని కొట్టి వేసింద‌ని అయినా జ‌గ‌న్ కు బుద్ది రాలేదంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాము హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ మాట్లాడే హ‌క్కు ఉంటుంద‌ని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ర్యాలీలు, పాద‌యాత్ర‌లు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే హ‌క్కు రాజ్యాంగం ఇచ్చింద‌న్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం చెల్లద‌న్నారు నారా లోకేష్.

Leave A Reply

Your Email Id will not be published!