NHRC Notice : తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు
ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం...
NHRC : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో యువకుడి మరణంపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. పోలీసుల టార్చర్ కారణంగా యువకుడు మరణించాడంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం..ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
NHRC Notices to Telangana Govt
అలాగే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ డీజీపీకి కూడా ఎన్హెచ్ఆర్సీ(NHRC) నోటీసులు పంపింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. మీడియా కథనాల్లో విషయాలు నిజమైతే, బాధితుడి మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి వస్తుందని కమిషన్ పేర్కొంది.
కాగా.. నగరంలోని టోలీచౌకికి చెందిన మహహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు. ఈ క్రమంలో అతడు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో.. విషయం తెలుసుకున్న రెండో భార్య నిలదీసింది. ఈ విషయంపై భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే మే 13న కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా.. అది ఎంతకీ తెగకపోవడంతో ఇరు వర్గాలు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను లోపలికి తీసుకెళ్లిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇర్ఫాన్ కుప్పకూలిపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అయితే పోలీసులు కొట్టడం వల్లే అతడు మరణించాడంటూ ఇర్ఫాన్ సోదరుడు ఆరోపించాడు. ఇర్ఫాన్ను తాము కొట్టలేదని పోలీసులు తెలిపారు. పోలీసుల టార్చర్ వల్లే యువకుడు మృతిచెందాడంటూ మీడియాలో కథనాలు రావడంతో ఈ ఘటనను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
Also Read : Minister Konda Surekha : అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత