కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుతూ సిమ్లా లోని హనుమాన్ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ప్రార్థనలు ఫలించాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ముందుకు వెళుతోంది. మొత్తం 224 సీట్లకు గాను 129 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది. బీజేపీ 67 సీట్లలో , జేడీఎస్ 25 సీట్లలో , 7 మంది ఇతరులు లీడింగ్ లో ఉన్నారు.
ఇక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ మరోసారి సత్తా చాటారు. ఆయన ఏకంగా 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీని సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం డీకే శివకుమార్ అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని గెలుపు పథంలోకి తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా తనకు తాను ట్రబుల్ షూటర్ నని మరోసారి నిరూపించుకున్నాడు.
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు కొనసాగతుండగానే ఇవాళ సిమ్లా పర్యటనలో ఉన్నారు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ గుడికి ప్రత్యేకత ఉంది. ఆమెకు పూజారులు స్వాగతం పలికారు. కర్ణాటక ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ప్రియాంక గాంధీ వాద్రా.
