ఐపీఎల్ 16వ సీజన్ లో ఊహించని రీతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలై చెత్త రికార్డు నమోదు చేసింది. రాజస్థాన్ లోని జైపూర్ లో స్వంత మైదానంపై పేలవమైన ఆట తీరుతో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ లో భాగంగా ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. ఆతిథ్య జట్టు రాజస్తాన్ రాయల్స్ 59 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈ విజయంతో 5వ స్థానానికి చేరుకుంది.
పవర్ ప్లే లోనే దిగ్గజ ఆటగాళ్లు 5 గురు పెవిలియన్ బాట పట్టారు. ఎవరూ కూడా రెండంకెల స్కోర్ దాట లేక పోయారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఠారెత్తి పోయారు. రాజస్థాన్ జట్టులో కేవలం ఒకే ఒక్కడు షిమ్రాన్ హిట్మెయర్ ఒక్కడే 35 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.
బెంగళూరు జట్టు తరపున వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. ఇక మైఖేల్ బ్రేస్ బెల్ , కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ , మాక్స్ వెల్ చెరో వికెట్ తీశాడు. అంతకు ముందు ఆర్సీబీ కెప్టెన్ ఫ్లాఫ్ డు ప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 రన్స్ చేశారు. ఆఖరులో వచ్చిన వికెట్ కీపర్ అనూజ్ రావత్ 10 బంతుల్లో 25 రన్స్ చేయడంతో భారీ స్కోర్ చేసింది. జంపా ,ఆసిఫ్ చెరో 2 వికెట్లు తీశారు.
