అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన కీలక పోరులో భారత్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. ఈ టోర్నీ లో మరోసారి రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మైదానంలోకి దిగిన భారత ఆటగాళ్లు దుమ్ము రేపారు. కప్ గెలవాలన్న కీవీస్ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు పవర్ ప్లేలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ. ఈ ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సంజూ శాంసన్ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. తను 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. భారీ స్కోర్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఇంకో వైపు అభిషేక్ శర్మ తక్కువ తినలేదు. తను 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక సంజూ శాంసన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. అభిషేక్ అవుట్ అయ్యాక మైదానంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ సూపర్ షో చేశాడు. తను కూడా ఉతికి ఆరేశాడు. 25 బాల్స్ ఎదుర్కొని 54 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆఖరులో వచ్చిన శివమ్ దూబే శివాలెత్తాడు. తను కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొని 26 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మైదానంలోకి దిగిన న్యూజిలాండ్ ఏ కోశాన ధీటుగా ఆడలేక పోయింది. ఇండియన్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన బౌలింగ్ స్పెల్ తో మ్యాజిక్ చేశాడు. కీలకమైన నాలుగు వికెట్లు కూల్చాడు. ఇండియాకు వరల్డ్ కప్ తీసుకు రావడంలో ముఖ్య భూమిక పోషించాడు. న్యూజిలాండ్ జట్టులో టిమ్ 52 రన్స్ తో ఆకట్టుకోగా కెప్టెన్ సాట్నర్ 43 పరుగులు చేశాడు. అయినా గెలిపించలేక పోయారు.
