హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని, ప్రజా పాలనకు మంగళం పాడారంటూ మండిపడ్డారు. సింగరేణి స్కాంలో సీఎం కీలక పాత్ర ఉందని, ఆయన బావమరిది సృజన్ రెడ్డికి గుత్త ఇచ్చేందుకు లోపాయికారిగా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈమేరకు ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. కేవలం మాట్లాడటమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేయడం జరిగిందన్నారు కేటీఆర్.
దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తునారంటూ మండిపడ్డారు. అయినా తమకు భయం లేదన్నారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ (Chief Minister) కాదు, సీఎం అంటే కోల్ మాఫియా (Coal Mafia) కి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో… లేదా విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. పది కోట్ల రూపాయలు సింగరేణి నిధులతో ఫుట్ బాల్ ఆడారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
