అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఆధ్యాత్మకత ఉట్టి పడేలా ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ పై కీలక సూచనలు చేశారు. ఉన్నత స్తాయి సమీక్ష సమావేశంలో సీఎం ఇప్పటి నుంచే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలన్నారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే ఈ గోదావరి పుష్కరాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉండాలన్నారు.
\గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేస్తున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పి నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారని, వాటిని కూడా పరిశీలించాలని సూచించారు. ఇటీవల గత ఏడాది దేశంలో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించారు. అలాంటి పొరపాట్లు రాకుండా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఆదేశించారు సీఎం.
