హైదరాబాద్ : దమ్మున్న డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. తాజాగా పవన్ కల్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్ పర్యవేక్షణలో నిర్మాణనంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఓ సర్ ప్రైజ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, వారం రోజులు ముందుగానే అంటే మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు, ఈ సినిమాకు ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు పని చేస్తుండటం విశేషం. పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నేపథ్య సంగీతం (బీజీఎం) బాధ్యతలను తమన్ స్వీకరించారు. రీల్స్ పంపడంలో జరిగిన జాప్యం, దేవిశ్రీ ప్రసాద్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఆయన సమయాన్ని కేటాయించ లేక పోవడంతో, పరస్పర అంగీకారంతోనే తమన్ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకున్నట్లు నిర్మాతలు వివరణ ఇచ్చారు. దేవిశ్రీ పాటలు, తమన్ నేపథ్య సంగీతంతో ఈ సినిమా అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
