వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీల గురించి ఇప్పటికీ ఒక్క మాట కూడా సీఎం కేసీఆర్ మాట్లాడలేదని మండిపడ్డారు. ఇది బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు. తన తనయుడు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి గా ఉన్న కేటీఆర్ దే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ఐటీ శాఖ నిర్లక్ష్యం కారణంగా పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే సిట్ ఇంకా పూర్తి నివేదిక సమర్పించలేదని, అంతలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రకటన చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఇవాళ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి పదవి వచ్చిందని , వాళ్ల కాన్ దాన్ పెరిగిందని కానీ నిరుద్యోగ బిడ్డల్లో ఒక్కరికి కూడా పర్మినెంట్ పోస్ట్ రాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిన పని చేస్తున్న వాళ్లను పర్మినెంట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బతుకులు ఆగం అవుతున్నా సీఎం సోయి లేకుండా నిద్ర పోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పాత బోర్డుతో ఎలా పరీక్షలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
