Home Minister Amit Shah: మయన్మార్ సరిహద్దులో కంచె ఏర్పాటు – అమిత్ షా
మయన్మార్ సరిహద్దులో కంచె ఏర్పాటు - అమిత్ షా
Home Minister Amit Shah: మయన్మార్ లో ఏర్పాటైన సైనిక ప్రభుత్వం… ప్రజాస్వామ్య వాదుల మధ్య నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశంలో రోజు రోజుకూ హింసా కాండ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మయన్మార్ నుండి సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోనికి అక్రమంగా చొరబడుతున్నారు. దీనితో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, మయన్మార్ ల సరిహద్దులోని 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మణిపుర్ లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె వేశాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్ లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి’ అని అమిత్ షా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
Home Minister Amit Shah Orders
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇప్పటివరకూ సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే మయన్మార్ నుంచి భారత్ లోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోవడంతో వాటిని అరికట్టేందుకు సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్ షా(Amit Shah) గత నెలలోనే ప్రకటించారు.
రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దు – భారత విదేశాంగ శాఖ ప్రకటన
మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. హింసాకాండ పెరిగిపోతుండడంతో భారతీయ పౌరులు ఎవరూ ఆ రాష్ట్రానికి వెళ్లొద్దని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. హింసాత్మక పరిస్థితులతోపాటు టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ లో అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత వంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా అక్కడికి వెళ్లొద్దని, ఇప్పటికే అక్కడ ఎవరైనా ఉంటే తక్షణమే ఆ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని భారతీయులను కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక అడ్వైజరీని విడుదల చేసింది.
Also Read : US Consulate Notification: రూ. 4.47 లక్షల వార్షిక వేతనంతో తాపీమేస్త్రీకి నోటిఫికేషన్ !